31 ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. 32 కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. 33 వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని 34 సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడి చెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.
19:31
ఆ దినము సిద్ధపరచుదినము
ఇక్కడ సిద్ధపరచు దినము శుక్రవారం (యోహాను 19:14). ఇది విశ్రాంతి దినమునకు సిద్ధపరచుట కొరకు, పస్కా పండుగకు సిద్ధపరచుట కొరకు కాదు. అది పస్కా వారంలో వచ్చినందున, అది ఒక ప్రత్యేకమైన సిద్ధపరచు దినము.
మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద ఉండకుండునట్లు
యూదులు యేసును న్యాయముగా చూడటం కన్నా, విశ్రాంతి దినమును గౌరవించడం మరియు మతపరమైన ఆచారాల గురించి ఎక్కువ ఆత్రుతపడ్డారు.
వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని
శిలువ వేయడం అనేది బాధితుని చంపడానికి చాలా సమయం తీసుకుంటుంది. బాధపడేవారి కాళ్లను విరగ్గొట్టడం మరణాన్ని వేగవంతం చేస్తుంది. అది శరీరానికి క్రూరమైన ఆఘాతాన్ని కలిగించి, మరణాన్ని త్వరితం చేస్తుంది.
యూదులు పిలాతును అడిగిరి,
దేహాలను చాలా కాలం పాటు, రోజుల తరబడి కూడా సిలువపై వేలాడదీయడం రోమన్ల ఆచారం.
19:32
కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.
సైనికులు ఆ ఇద్దరు నేరస్తుల కాళ్లను విరగ్గొట్టారు కానీ యేసు కాళ్లను విరగ్గొట్టలేదు.
19:33
వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి
సైనికులు వచ్చేసరికి యేసు తనంతట తానే మరణించాడు.
ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని,
యేసు అప్పటికే మరణించినందున, సైనికులు ఆయన కాళ్లను విరవలేదు. పస్కా గొఱ్ఱెపిల్ల వలె, యేసు ఎముకలు విరవబడలేదు (నిర్గమకాండము 12:46). సైనికులు పిలాతు ఆజ్ఞాపించినట్లు చేయలేదు, కానీ వారు చేయవలసినది చేశారు.
19:34
సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడి చెను,
ఒక సైనికుడు, యేసును సిలువ నుండి దించే ముందు ఆయన మరణించాడని నిర్ధారించుకున్నాడు. ఆయన ప్రక్కను ఈటెతో పొడిచి అతను ఈ పని చేశాడు. యేసు ప్రక్కను ఈటెతో పొడవడం జెకర్యా 12:10 యొక్క నెరవేర్పు.
మెస్సీయ కీర్తన 22:16, “వారు నా చేతులను, నా పాదాలను పొడిచారు” అని చెబుతోంది. సిలువ వేయడం యూదుల మరణశిక్ష పద్ధతి కాదు; వారు రాళ్లతో కొట్టి చంపేవారు. కీర్తన 22 పొడవడాన్ని సూచించడం, సిలువ వేయడంలో ప్రతి విషయంలోనూ దేవుని సార్వభౌమాధికారాన్ని చూపిస్తుంది.
వెంటనే రక్తమును నీళ్లును కారెను.
విశ్వసించే వ్యక్తి యొక్క ఆత్మను రక్షించేది క్రీస్తు రక్తమే, అనగా రక్తము చిందించి మరణించుటలో ఆయన తన శరీరమును బలియాగంగా అర్పించుట.
సూత్రం:
పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి యేసు తన రక్తాన్ని చిందించాడు.
అనువర్తనం:
యేసు మన పాపానికి శిక్షను భరించాడు. దేవుని పరిపూర్ణమైన లేదా సంపూర్ణమైన నీతి యొక్క ప్రమాణాన్ని నెరవేర్చడానికి ఆయన మరణించాడు (1 యోహాను 2:2).
